ఐపీఎల్-10 సీజన్ టైటిల్ అందుకున్న ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును అందుకున్నాడు. భారత క్రికెటర్లలో అత్యధిక టీ20 ట్రోఫీలు అందుకున్న ఆటగాడిగా నిలిచాడు.
ఐపీఎల్-10వ సీజన్ ఫైనల్లో రైజింగ్ పుణె సూపర్జెయింట్- ముంబయి ఇండియన్స్ తలపడ్డాయి. చివరి వరకూ ఆసక్తికరంగా సాగిన పోరులో ముంబయి ఒక్క పరుగు తేడాతో గెలిచి మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. లేటెస్ట్ విక్టరీతో రోహిత్ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రికార్డును అధిగమించాడు. టీ20ల్లో(ఐపీఎల్, అంతర్జాతీయ) ట్రోఫీ కైవసం చేసుకున్న జట్టులో రోహిత్ ఏడుసార్లు సభ్యుడిగా ఉన్నాడు. ప్రపంచకప్ టీ20, ఆసియా కప్ టీ20, ఐపీఎల్లో నాలుగు సార్లు(ముంబయి ఇండియన్స్ తరఫున మూడు సార్లు, డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఒకసారి), ఛాంపియన్స్ లీగ్ టీ20ల్లో ట్రోఫీ కైవసం చేసుకున్న జట్టులో అతను సభ్యుడు. ఆ తర్వాతి స్థానాల్లో ధోనీ, సురేశ్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, అంబటిరాయుడు తలో ఆరుసార్లు సభ్యులుగా ఉన్నారు.