కానిస్టేబుల్ అభ్యర్థులకు 8 మార్కులు?.. పోలీస్ శాఖ ఏం చెప్పిందంటే..
తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో తప్పులు దొర్లినట్లు నిన్నటి నుండి ప్రచారం జరుగుతుంది. మొత్తం 13 ప్రశ్నల్లో గందరగోళం ఉందని, దీంతో గరిష్టంగా 8 మార్కులు కలిపేందుకు అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దంటూ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. సెట్ 'డి'లో కొన్ని ప్రశ్నలకు సంబంధించి గందరగోళం ఏర్పడినట్టు తమకు ఫిర్యాదులు వచ్చాయని, ఆ ఫిర్యాదులను నిపుణుల కమిటీ పరిశీలించి రెండు రోజుల్లో స్పష్టత ఇస్తుందని తెలిపారు. అప్పటివరకు పుకార్లను నమ్మవద్దంటూ సూచించారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. సివిల్, ట్రాన్స్పోర్టు, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం పరీక్షలు నిర్వహించింది. సివిల్ ఇతర విభాగాల్లో 15,644, రవాణాశాఖలో 63, ఎక్సైజ్శాఖలో 614 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నియామకానికి గత ఏప్రిల్లో నోటిషికేషన్ విడుదల చేసిన విషయం విధితమే. ఆయా పోస్టులకు 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ కానిస్టేబుల్ పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. 91.34 శాతం హాజరు నమోదైంది.