ఏపీ పోలీసులు.. అధికారంలో ఉన్న నేతలకే కాదు.. వారి ఫ్లెక్సీలకు కూడా సెక్యూరిటీ అందిస్తున్నారు. నెల్లూరు నగరంలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సే అనిల్ కుమార్ యాదవ్ ఫ్లెక్సీకి సీఐతో పాటు 15 మంది పోలీసులు సెక్యూరిటీగా ఉండటం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో పోలీసులు అధికార నేతలకు వత్తాసు పలుకుతున్నారని మీడియా కోడై కూస్తుంది. తాజా సంఘటన చూస్తే మాత్రం అది నిజమే ఏమోనన్న అనుమానం రాకపోదు. లేకపోతే ఫ్లెక్సీకి 15 మంది కాపలా ఏంటని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు సామాన్య జనం.
రెండు రోజుల క్రితం ఆ రాష్ట్ర మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ బర్త్ డే సందర్భంగా అభిమానులు నర్తకి సెంటర్లో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఆ కటౌట్ అడ్డుగా ఉందని తొలగించాలని నగరపాలక సంస్థ అధికారులను టీడీపీ నగర ఇన్ ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కోరారు. అయితే ఇటీవల టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదివారం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయడానికి వచ్చారు. ఎమ్మెల్యే ఫ్లెక్సీ తొలగిస్తారమో నన్న అనుమానంతో సీఐతో పాటు 15 మంది ఫ్లెక్సీ వద్ద గస్తీ కాశారు. ఫ్లెక్సీలపై నిషేధం అంటూనే ఇలా పహారా కాయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.