పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం 19 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. సభకు ఆటంకం కలిగిస్తున్న కారణంగా వారిపై వేటు వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ తెలిపారు. వెల్లోకి దూసుకెళ్లిన ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. జీఎస్టీ, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, దీవకొండ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్రలను వారం పాటు సస్పెండ్ చేశారు. టీఎంసీ ఎంపీలు సుస్మితా దేవ్, డాక్టర్ సంతనూ సేన్, డోలా సేన్లతో పాటు ఇతర ఎంపీలపై కూడా వారం పాటు సస్పెన్షన్ విధించారు. వేటు పడిన వారిలో కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు కూడా ఉన్నారు. నిన్న కూడా కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, రమ్య హరిదాస్, జ్యోతిమణి, టీఎన్ ప్రతాపన్లపై సస్పెన్షన్ వేటు పడింది.