ఆఫ్ఘన్లో బాంబ్ బ్లాస్ట్.. ఇద్దరు దౌత్యవేత్తలు సహా 20 మంది మృతి
ఆఫ్ఘన్ రాజధాని కాబూల్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు దౌత్యవవేత్తలతోపాటు 20 మంది వరకు మరణించారు. రష్యా రాయబార కార్యాలయం వెలుపల సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. రష్యా ప్రభుత్వ అనుబంధ మీడియా ఆర్టిఈ వివరాలను అందించింది. వీసాల కోసం దౌత్యకార్యాలయ గేట్ల వెలుపల ఎదురుచూస్తున్న సమయంలో పేలుడు జరిగింది. దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిపై ఎంబసీ గేట్ల వెలుపల తాలిబాన్ గార్డ్లు మొదట కాల్పులు జరిపారు. అయితే గార్డులు కాల్చిన వెంటనే తనను తాను పేల్చుకున్నాడు బాంబర్. అయితే పేలుడుకు పాల్పడింది ఎవరన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇంతకు ముందు ఆగస్టు 2న హెరాత్లోని మసీదులో పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హెరాత్ ప్రావిన్స్లో గుజార్గా మసీదులోనూ శుక్రవారం ప్రార్థనల సమయంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా మతపెద్ద ముజీబ్ ఉల్ రెహ్మాన్ అన్సారీ, అతని భద్రతా సిబ్బంది సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారని హెరాత్ పోలీసు అధికారులు తెలిపారు. తాలిబన్లు కాబూల్ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో చాలాచోట్ల బాంబుదాడులు కొనసాగుతున్నాయి.