ఏపీలోకి ఇంటర్ విద్యార్థులకు శుభవార్త. విద్యార్థులు తమ పైచదువులకై.. ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు రాసే ఈఏపీసెట్లో ఈ ఏడాది వెయిటేజీ ఇవ్వనున్నారు. గతంలో కూడా ఇంటర్ మార్కులకు ఈఏపీసెట్ లో మొత్తం 25 శాతం వెయిటేజీ ఇచ్చేవారు. కానీ కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు నిర్వహించని నేపథ్యంలో.. ఈఏపీసెట్ పరీక్షకు ఇంటర్ వెయిటేజ్ను తీసేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అయితే గతేడాది ఇంటర్ పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో ఈసారి యదాతథంగా 25 శాతం ఇవ్వనున్నట్లు తాజాగా అధికారులు తెలిపారు. ఇది విద్యార్థులకు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ఈఏడాది ఈఏపీసెట్ పరీక్షకు హాజరయ్యే వారు గతేడాది ఫస్ట్ ఇయర్ పరీక్షకు హాజరయ్యారు. అదేవిధంగా ఈ ఏడాది సెకండ్ ఇయర్ పరీక్షలకు కూడా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు వెయిటేజ్ను ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది ఫస్ట్ ఇయర్లో 70శాతం సిలబస్నే విద్యార్థులు చదివినందున ఈఏపీసెట్లోనూ ఆ మేరకే ప్రశ్నలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ఈఏడాది ఈఏపీసెట్ షెడ్యూల్ విషయానికొస్తే.. మే 15 నుంచి 22 వరకు ఎంపీసీ విభాగం ఎగ్జామ్స్ ను, మే 23 నుంచి 25 వరకు బైపీసీ విభాగంలో పరీక్షను నిర్వహించనున్నారు.