విదేశాల్లో భారతీయులు అనేక విజయాలు సాధిస్తున్నారు. విద్యా, వైద్యం, రాజకీయాల్లో కూడా ఇండియన్స్ రాణిస్తున్నారు. తాజాగా కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎనిమిది మంది భారత సంతతి వ్యక్తులు గెలుపొందారు. న్యూ డెమొక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) అపూర్వ విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చింది.
ఈ పార్టీకి సిక్కు మతస్తుడైన జగ్మీత్సింగ్ సారథ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో 87 మంది సభ్యులు గల శాసనసభలో ఎన్డీపీకి 55 సీట్లు దక్కాయి.
శనివారం వెల్లడైన ప్రాథమిక ఫలితాల్లో.. రిచ్మండ్-క్వీన్స్బర్గ్ ప్రాంతం నుంచి అమన్ సింగ్ గెలిచారు. కార్మికమంత్రి హ్యారీ బైన్స్ – సర్రే న్యూటన్ నుంచి, రవి కహ్లోన్ -డెల్టా నార్త్, ఉప సభాపతి రాజ్ చౌహాన్ బర్నాబే ఎడ్మండ్స్ నుంచి, జగ్రూప్ బ్రార్ – సర్రే ఫ్లీట్వుడ్ నియోజక వర్గాల నుంచి గెలుపొందారు. ఎన్డీపీ పార్టీ నుంచి భారత సంతతికి చెందిన మహిళలు మాజీ మంత్రి జిన్నీ సిమ్స్, నికీ శర్మ, రచనా సింగ్ విజయం సాధించారు. కాగా, 5 లక్షల పోస్టల్ వోట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. తుది కౌంటింగ్ కోసం తాము ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని అన్నారు. ప్రజలకు అవసరమైన సేవలు, కోవిడ్ను ఎదుర్కోవటం, సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని విజయం సాధించినవారు అన్నారు.