
బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ సౌత్ సినిమాలపై, చిత్రపరిశ్రమలపై హాట్ కామెంట్స్ చేశారు. సౌత్ నుంచి రెండు సినిమాలు భారీ విజయాన్ని సాధించినంతా మాత్రనా బాలీవుడ్ స్థాయి తగ్గినట్లు కాదని అన్నారు.
అభిషేక్ మాట్లాడుతూ.. “భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఎంతో పెద్దది. ఎన్నో భాషలు, సంస్కృతులతో కూడుకున్నది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రూపుదిద్దుకున్న చిత్రాలు దేశంలో ఎప్పుడైనా, ఎక్కడైనా రీమేక్ అవుతుంటాయి. హిందీ సినిమాలను కూడా రీమేక్ చేస్తుంటారు.
రీమేక్ చేయడమంటే క్రియేటివ్ ఆలోచనలు పంచుకోవడమే. దక్షిణాది చిత్రాలు హిందీలోకి, అలాగే ఇక్కడి సినిమాలు అక్కడి భాషలకు రీమేక్ చేయడమనేది సుమారు 70 ఏళ్ల నుంచి జరుగుతోంది.
రీమేక్ చేస్తున్నామంటే దాని అర్ధం.. బాలీవుడ్లో టాలెంట్కి కొరత ఉందని కాదు. భారతీయ చలన చిత్ర పరిశ్రమ నుంచి ప్రతి ఏడాది వెయ్యికి పైగా చిత్రాలు బయటకు వస్తుంటాయి. అందులో కేవలం రెండు చిత్రాలే (ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ 2) ట్రెండ్ని ఎలా నిర్దేశిస్తాయి?” అని అభిషేక్ పరోక్షంగా ప్రశ్నించారు.
మరోపక్క ‘బాహుబలి’, ‘బాహుబలి-2’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్, ‘కేజీయఫ్’, ‘కేజీయఫ్-2’ ఇలా వరుస భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రాలతో దక్షిణాది చిత్ర పరిశ్రమ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అంతేకాకుండా ఈ చిత్రాలు బాలీవుడ్లోనూ రికార్డ్ సృష్టించాయి. దీంతో అందరి చూపు దక్షిణాదిపైనే ఉంది. అయితే, గతకొన్ని రోజులుగా బాలీవుడ్, దక్షిణాది నటీనటుల మధ్య పరోక్షంగా మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ సైతం దక్షిణాది చిత్రపరిశ్రమపై కామెంట్స్ చేశారు.