మానవత్వంతో సాటి మనిషికి సాయం చేసేందుకు సేకరించిన రూ. 11 కోట్ల విలువైన రక్షణ సామగ్రి మంటల్లో కాలిపోయింది. ఏపీలోని విశాఖపట్నం పెదగంట్యాడలో ఈ ఘటన జరిగింది. కొవిడ్ నేపథ్యంలో ప్రజలకు పంపిణీ చేసేందుకు వీలుగా విదేశాల నుండి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) పంపిన.. శానిటైజర్లు, గ్లౌజులు, మాస్క్లు, ఇతర సామగ్రి దగ్ధమయ్యాయి. ఈ సామగ్రినంతా పెదగంట్యాడలో శ్రావణి షిప్పింగ్ గోదాములో భద్రపరచారు. ఏమైందో తెలియదు కానీ బుధవారం సాయంత్రం గోదాములో అగ్ని ప్రమాదం సంభవించి ఆ సరుకు అంతా మంటల్లో కాలిపోయింది.
గతేడాది డిసెంబరులో కెనడా నుంచి రెడ్క్రాస్ సొసైటీ ద్వారా ఈ సామగ్రిని దిగుమతి చేసుకున్నట్లు సొసైటీ రాష్ట్ర ఛైర్మన్ శ్రీధర్రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాలకు గవర్నర్ చేతుల మీదుగా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సరకు తీసుకురావడానికి, ఇక్కడ గోదాములో భద్రపరచడానికి అవసరమైన అనుమతుల్లో జాప్యం వల్ల పంపిణీ ఆలస్యమైందన్నారు. ఈ విషయాన్ని తానా సభ్యుల దృష్టికి తీసుకెళ్లామని ఆయన చెప్పారు.