టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావు ఆదివారం తెల్లవారుజామున మరణించిన విషయం తెలిసిందే. 1200 లకు పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఎన్టీ రామారావుతో అత్యధిక సినిమాల్లో నటించిన వ్యక్తిగా చలపతి రావు నిలిచారు. 1966లో ఇండస్ట్రీకి వచ్చి అప్పటి నుండి విరామం లేకుండా అనేక చిత్రాల్లో నటించారు. చలపతి రావు మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులంతా హైదరాబాద్లోని ఆయన నివాసానికి చేరుకొని నివాళులర్పిస్తున్నారు. షూటింగ్ నిమిత్తం వేరే దేశాల్లో ఉన్నవారు.. చలపతిరావు కొడుకు రవిబాబుని ఫోన్ ద్వారా పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో రవిబాబు.. తండ్రి మరణం గురించి స్పందించారు.
తన తండ్రి చలపతిరావు చాలా ప్రశాంతంగా కన్నుమూశారని రవిబాబు చెప్పారు. “ఆయన జీవితంలో ఎలా హ్యాపీగా ఉన్నారో, అందరినీ ఎలా నవ్విస్తూ ఉండేవారో అలానే ప్రశాంతంగా వెళ్లిపోయారు. భోజనం చేసి, చికెన్ కూర, చికెన్ బిర్యాని తిన్నారు. ఆ తర్వాత పడుకోవడానికి తన గదికి వెళ్లారు. ఆ తర్వాత సింపుల్ గా, హ్యాపీగా ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. ఈ రోజే అంత్యక్రియలు నిర్వహిద్దామనుకున్నాం. కానీ, మా సిస్టర్స్ అమెరికాలో ఉన్నారు. వాళ్లు రావడానికి టైం పడుతుంది. మంగళవారం మంచి రోజు కాదు కాబట్టి బుధవారం నిర్వహిస్తాం” అని మీడియాతో చెప్పారు.
ఇండస్ట్రీలో తన తండ్రి ఎంతో మందికి సాయం చేశారని, ఆ విషయం కుటుంబంలో ఎవ్వరికీ తెలిసేది కాదన్నారు. తాను పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాతనే ఆయన ఎలాంటి వారో పూర్తిగా అర్థం అయ్యిందన్నారు. “మా నాన్న గురించి నాకంటే మీ అందరికే ఎక్కువ తెలుసు. ఆయన ఎలాంటి వ్యక్తి, ఇండస్ట్రీలో ఎలా ఉంటారనే విషయం చిన్నప్పుడు నాకు తెలియదు. కానీ, నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే తెలిసింది. అందరూ ఆయన గురించి గొప్పగా చెప్పేవారు. ఎంతో మందికి సాయం చేశారని తెలిసింది. ఈ విషయాలు మాకు తెలిసేవి కాదు. మా నాన్నకు రామారావు గారు, ఆహారం, హాస్యం ఈ మూడే చాలా ఇష్టం. ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉండేవారు. అలానే ఇప్పుడు ఒక్క క్షణంలో ఎలాంటి బాధ లేకుండా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. అలాంటి వ్యక్తికి శత్రువులు ఎవ్వరూ ఉండరు. నా కొత్త సినిమాలో ఆయన చివరగా నటించారు. ఐదు రోజుల క్రితమే షూటింగ్ లో పాల్గొన్నారు. అదే ఆయనకు చివరి చిత్రం” అని రవిబాబు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
‘చలపతిరావు గారు మా కుటుంబ సభ్యుడు’- నందమూరి బాలకృష్ణ
సినిమా సెలబ్రిటీల బండారం బయటపెడతా : నటి వార్నింగ్
2022 బాలీవుడ్ టాప్ 10 చిత్రాలు..!