ఆదిపురుష్ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కోసం భారీ డీల్.. ఎన్ని కోట్లంటే..?
బహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఆయనతో సినిమా చేయాలంటే వందల కోట్లు పెట్టాల్సింది. మూవీ కలెక్షన్లు సైతం ఆ స్థాయిలోనే ఉంటాయి. డార్లింగ్ నటించిన రాథేశ్యామ్, సాహే సినిమాలు ఫ్లాపైనా అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. తాజాగా ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ జూన్ 16న పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకు సిద్ధమైంది. తాజా అప్డేట్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ రేటు చెల్లించి ఓ బడా నిర్మాణ సంస్థ తీసుకుందని సమాచారం.
ప్రేక్షకుల ఎదురుచూపు
రామయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, సీతగా కృతి సనన్, లంకాధీశుడు రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి గతేడాది టీజర్ రిలీజ్ చేయగా.. గ్రాఫిక్స్ విషయంలో నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. దీంతో మూవీ యూనిట్ వీఎఫ్ఎక్స్ మార్చి ట్రైలర్ రిలీజ్ చేసింది. ఇది కాస్తా ఆదిపురుష్ పై జనాల్లో అంచనాలు విపరీతంగా పెంచేసింది. మరో మూడు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
పీపుల్స్ మీడియా చేతికి 'ఆదిపురుష్'
మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా పీపుల్స్ మీడియా కంపెనీ ఓ సినిమా తెరకెక్కిస్తోంది. అదే సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆదిపురుష్ థియేట్రికల్ రైట్స్ కొనుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రూ.170కోట్లు ఆఫర్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఈ ఫిగర్ ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయినట్లేనన్న వాదన వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఆర్ఆర్ఆర్ తర్వాత భారీ మొత్తానికి థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోయిన రెండో చిత్రంగా ఆది పురుష్ నిలవనుంది.
ఆర్ఆర్ఆర్ తర్వాత
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ. 226 కోట్లకు విక్రయించారు. ప్రభాస్ సాహో రేటు రూ.124 కోట్లు పలకగా, బాహుబలి 2 రూ.120 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ లెక్కన చూస్తే తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ రూ.170 కోట్లు పలికిన ఆదిపురుష్, ఆర్ఆర్ఆర్ తర్వాతి స్థానంలో నిలిచింది. ప్రభాస్ ఇమేజ్ దృష్ట్యా ఈ రేంజ్ బిజినెస్ జరిగిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మూవీకి పాజిటివ్ టాక్ వస్తే గనుక తొలిరోజే భారీ కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సోమవారం సెకండ్ సింగిల్
ఆదిపురుష్ మూవీలోని రెండో పాటను చిత్ర యూనిట్ మే 29న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనుంది. 'రామ్ సియా రామ్' అని సాగే ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా… సచేత్ పరంపర సంగీతం అందించారు. రేడియో స్టేషన్స్, మూవీ ఛానల్స్, నేషనల్ న్యూస్ ఛానల్స్, అవుట్ డోర్ బిల్ బోర్డ్స్, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్స్, టిక్కెటింగ్ పార్ట్నర్స్, మూవీ థియేటర్స్, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్… 70కు పైగా మార్కెట్లలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు 'ఆదిపురుష్' టీం ప్రకటించింది.