రైతులు, ఆవుల పెంపకందారులకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఓ గుడ్న్యూస్ చెప్పింది. ఇక నుంచి రైతుల దగ్గర నుంచి గో మూత్రం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆవు పేడను ప్రభుత్వం సేకరిస్తున్న విషయం తెలిసిందే. పాడి పరిశ్రమ ఆర్థికంగా లాభదాయకంగా ఉండేలా చేయడం కోసం ఈ చర్యలను అమలు చేస్తోంది. పేడతో పాటు మూత్రాన్ని లీటరుకు రూ.4లు ఇచ్చి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 28న స్థానిక హిరేలి పండుగ సందర్భంగా పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ మేరకు శుక్రవారం వెల్లడించారు. మరో రెండు వారాల్లో కొన్ని జిల్లాల్లో ఈ పథకం పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు.
ఈ మేరకు గ్రామ గౌతన్ సమితి ద్వారా గో మూత్రాన్ని కొనుగోలు చేసి పశువుల యజమానులకు 15 రోజులకోసారి చెల్లింపులు చేయనున్నారు. ఇలా సేకరించిన మూత్రాన్ని సేంద్రీయ పురుగు మందుల తయారీకి మాత్రమే వినియోగిస్తారని అధికారులు తెలిపారు. కాగా రాష్ట్రంలో పాలు ఇవ్వని ఆవులను వదిలేయడంతో రోడ్లపై అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆవుల పెంపకాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులు, పశువుల యజమానుల నుంచి ఆవు పేడను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 25, 2020 ఛత్తీస్గఢ్లో గోధన న్యాయ్ యోజన పథకాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇలాంటి వినూత్న పథకాలను చేపడుతుంది.