‘అగ్నిపథ్’ నిరసనల కారణంగా జగన్ సర్కార్ అప్రమత్తమైంది. శనివారం ఉదయం నుంచి విశాఖపట్టణంలోని పలు రైల్వేస్టేషన్ల వద్ద భారీగా భద్రత పెంచినట్లు సీపీ శ్రీకాంత్ తెలిపారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ లోకల్ పోలీసులతో అన్ని స్టేషన్ల వద్ద భద్రతను ఏర్పాటు చేశామని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..”విశాఖ రైల్వే స్టేషన్లపై దాడులు పాల్పడవచ్చుననే సమాచారం అందింది. విశాఖ రైల్వేస్టేషన్తోపాటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశాం. ఎవరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. యువత కేసుల్లో ఇరుక్కుని జీవితాలను నాశనం చేసుకోవద్దు” అని ఆయన అన్నారు.
ఈ క్రమంలో పోలీసులు విశాఖ నగరంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానం ఉన్న వారిని క్షుణ్ణంగా చెక్ చేస్తూ, బస్సులు, బైకులు, ఆటోలు, కార్లు ఆపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అగ్నిపథ్ ఆందోళనల కారణంగా మధ్యాహ్నం 12 గంటల వరకు విశాఖ రైల్వే స్టేషన్ మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రైల్వే స్టేషన్కు వస్తున్న ప్రయాణికులను వెనక్కి పంపిస్తున్నారు. విజయవాడ వైపు వెళ్లే వాళ్లు, వచ్చే వాళ్ళు దువ్వాడ వెళ్లాలని, కోల్కత్తా, ఒరిస్సా వైపు నుంచి వచ్చే వాళ్లు, వెళ్లేవాళ్లు కొత్తవలస వెళ్ళాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.