హైదరాబాద్ను తాకిన అగ్నిపథ్..స్టేషన్లోకి చొచ్చుకెళ్లి రైలుకు నిప్పు..
కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన 'అగ్నిపథ్' పథకంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు ఉద్రిక్తంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అగ్నిపథ్ ఆందోళనలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను తాకాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు నేడు ఎన్ఎస్యూఐ విద్యార్థులు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. అనంతరం సికింద్రాబాద్ రైల్యేస్టేషన్లోకి చొచ్చుకెళ్లి రెండు బోగీలకు నిప్పంటించారు. దాంతో మొదటి, మూడు ఫ్లాట్ఫాంలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. హౌరా ఎక్స్ప్రెస్, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ సహా మూడు రైళ్లకు ఆందోళనకారులు నిప్పంటించటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్రమత్తమైన పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
ముందుగా నిరసనకారులు అగ్నిపథ్ను వెంటనే రద్దు చేసి ఆర్మీ పరీక్షను యథావిధిగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ, ఆర్మీ అభ్యర్థులు వేల సంఖ్యలో సికింద్రాబాద్లో ఆందోళనకు దిగారు. క్రమ క్రమంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్దకు చేరుకున్నారు. రైల్యే స్టేషన్ ముందు ఉన్న ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న బస్సుల అద్దాలను ధ్వంసం చేయడంతో అక్కడున్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఆందోళనకారులంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పరుగులు తీసి, అక్కడ నిలిచి ఉన్న రైళ్లపై రాళ్లు రువ్వి, నిప్పు అంటించారు. దాంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
మరోపక్క కేంద్రం నిర్ణయంపై బీహార్లో తీవ్రస్థాయిలో నిరసన జ్వాలలు చెలరేగాయి. రైళ్లను, ఇతర రవాణా వాహనాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించి, కార్యాలయంలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఆపై నిప్పంటించారు. బీజేపీ ఎమ్మెల్యే అరుణాదేవి కోర్టుకు వెళుతుండగా ఆమె వాహనంపై రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ రైల్యే స్టేషన్లో ఆందోళనకారులు రాళ్లు రువ్వటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.