అగ్నిపథ్ను నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు మాత్రమే దారితీయకుండా.. విధ్వంసాన్ని సృష్టించింది. అయితే, ఈ విధ్వంసానికి కారణం రైల్వే పోలీసులే అంటున్నారు ఆందోళనకారులు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన తమపై రైల్వే పోలీసులు లాఠీచార్జ్ చేశారని మండిపడ్డారు. రైల్వే స్టేషన్లో ఈ పరిస్థితి, విధ్వంసానికి కారణం పోలీసుల లాఠీఛార్జ్యేనని వారు ఆరోపిస్తున్నారు.
అగ్నిపథ్ ప్రకటన వెలువడిన తర్వాత నిరసన కార్యక్రమం నిర్వహించాలనుకున్నాం. గురువారమే ఇందుకు సంబంధించి వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టుకున్నాం. కేవలం రైళ్లు ఆపి నిరసన తెలుపుదాం అనుకున్నాం. కానీ, ఉద్రిక్త పరిస్థితులకు పోలీసులే కారణం. మాకు ఇప్పటికే ఫిజికల్, మెడికల్ టెస్ట్లు పూర్తయ్యాయి. రెండేళ్లుగా రాతపరీక్ష కోసం ఎదురుచూస్తున్నాం.. అగ్నిపథ్ పథకం తీసుకొస్తే మా పరిస్థితి ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. సికింద్రాబాద్ ఘటనపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆరా తీస్తోంది. ఆందోళనకారుల వాట్సాప్ చాటింగ్పై నిఘా పెట్టింది. రెండు రోజుల క్రితమే స్టేషన్పై దాడికి ప్లాన్ జరిగినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.