సెన్సేషనల్ హిట్ ‘అర్జున్ రెడ్డి’ సినిమా మరో రికార్డుకు సిద్ధమవుతోంది. మూడు గంటల సుదీర్ఘ నిడివితో విడుదలైన ఈ సినిమా నిడివిని మరో 40 నిమిషాలు పొడిగించాలని మూవీ టీం భావిస్తోంది. ‘నిడివిని పెంచాలని అనుకుంటున్నాం. మేం 40 నిమిషాల ఫుటేజీని ఎడిటింగ్ టేబుల్ వద్ద త్యాగం చేశాం. అసలు మేం చిత్రీకరించిన ప్రతి షాట్ సినిమాకు చాలా అవసరం. వాటన్నిటిని చూస్తేనే మొత్తం కథ బాగా తెలిసిపోతుంది. అయినా ప్రేక్షకులను సినిమాను మొత్తం ఇష్టపడ్డారు. ఇప్పుడు ఎడిటింగ్ లో తీసేసిన సీన్లను కూడా కలపాలని కోరుకుంటున్నాం. ఆ ఫుటేజీ కూడా కథకు చాలా ముఖ్యం’ అని హీరో విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. సినిమాలో ఎడిట్ చేసిన 10 నిమిషాల సీన్లను కలిపి మళ్లీ విడుదల చేయనున్నట్లు వార్తలు రావడం తెలిసిందే. అసలు సినిమా కోసం షూట్ చేసిన దృశ్యాలన్నీ ఐదారు గంటల నిడివి ఉన్నాయి.