తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే సునీత భావోద్వేగానికి గురయ్యారు. ఈరోజు సమావేశాలు ప్రారంభమైన తరువాత సభాపతి తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ నేపథ్యంలో సభ్యులు కిడ్నీ రోగుల అంశంపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సునీత కిడ్నీ రోగుల అంశంపై మాట్లాడుతూ.. కంటతడి పెట్టారు. డయాలసిస్ పేషెంట్ల సమస్యలను సభలో ప్రస్తావించారు.
ఈ సమస్యలతో బాధ పడుతున్న కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నారని సభకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె నాన్నను గుర్తుకు తెచ్చుకున్నారు. నాన్న కూడా.. 14 ఏళ్లుగా డయాలిసిస్ పేషెంట్గా ఉన్నారని.. దీంతో తాము ఆర్థికంగా చితికిపోయామన్నారు. తాము ఎంతో బాధ పడ్డామంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాధి ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నాయి అన్నారు. ఆ కుటుంబాలను ఆదుకోవాలి కాబట్టి.. ఆసరా పెన్షన్లు, ఎయిడ్స్ పేషెంట్స్ ఇచ్చినట్లుగానే కిడ్నీ పేషెంట్లకు పెన్షన్ ఇవ్వాలని కోరారు.