రైల్వే ప్రయాణీకులకు భారతీయ రైల్వే మంచి శుభవార్తను చెప్పింది. ఇప్పటికే రైల్వే స్టేషన్లలో ఉచిత బ్రాడ్ బ్యాండ్ సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సేవలను పెంచుతూ మరిన్ని సేవలను అందించేందుకు సిద్దమైంది. రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులకు పాన్, ఆధార్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా, ఒక కొత్త సేవను ప్రారంభిస్తున్నామని పేర్కొంది. ‘రైల్ వైర్ సాథి కియోస్క్’ పేరుతో ఈ కొత్త సేవలను అందిస్తామని భారతీయ రైల్వే తెలిపింది.
అంతేకాకుండా పైలట్ ప్రాజెక్టులో భాగంగా మొదట వారణాసి, ప్రయాగ్రాజ్ సిటీ రైల్వే స్టేషన్లలో కామన్ సర్వీస్ సెంటర్లను జనవరిలో రైల్వేశాఖ ప్రారంభించింది. ఇప్పుడు దేశం మొత్తం ఈ సేవలను విస్తరించే ఆలోచనలో ఉంది. ”రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికులు రైల్ వైర్ సాథి కియోస్క్ కేంద్రాల వద్ద ఆధార్ కార్డు, పాన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే టికెట్ బుకింగ్, ఓటరు కార్డు, మొబైల్ రీచార్జ్, రైలు, విమాన, బస్సు టిక్కెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ సేవ కేంద్రాలలో ఆదాయపు పన్ను, బ్యాంకింగ్, బీమా సంబంధించి పనులకు ఇక్కడే పూర్తి చేసుకోవచ్చు” అని తెలిపింది.