రోజూ నిత్యవసరాలకై వాడుతున్న కూరగాయల ధరలు ఎంతలా మండిపోతున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక నిమ్మకాయలు, టమాటాల ధర గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సామాన్యడు.. వాటి జోలికి కూడా పోవట్లేదు. కారణం కిలో రూ.100 దాటడమే. గురుగ్రామ్లోని ఓ హోల్సేల్ మార్కెట్లో దొంగలు పడ్డారు. దుండగులు పది బస్తాల నిమ్మకాయలు, 35 క్రేట్ల టమాటాలు, 15 ప్యాకెట్ల క్యాప్సికమ్ను ఎత్తుకెళ్లారని తెలిసింది. గురుగ్రామ్లోని ఖంద్సా హోల్సేల్ మార్కెట్కు సందీప్ అనే డ్రైవర్ గురువారం రాత్రి కూరగాయలు తీసుకొచ్చాడు. అయితే తెల్లారి వచ్చి చూడగా షాప్ షెట్టర్ సగం తెరచి ఉన్నదని, అందులో ఉన్న సరుకును ఎవరో ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాటి విలువ హోల్సేల్ మార్కెట్లో రూ.60 వేల నుంచి రూ.70 వేలు ఉంటుందని, అదే రిటైల్ మార్కెట్లో రూ.లక్షా 50 వేల దాకా ఉంటుందని చెప్పాడు.