అగ్నివీరులకు ఆనంద్ మహీంద్రా ఆఫర్..
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన 'అగ్నిపథ్'పై జరుగుతున్న హింసాత్మక ఆందోళనలపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విటర్ వేదికగా స్పందించారు. " నేను ఒక్కటే చెప్పాను. ఇప్పుడు అదే చెబుతున్నా. ఈ పథకంతో అగ్నివీరులు పొందే క్రమశిక్షణ, నైపుణ్యాలు వారికి మంచి ఉపాధి లభించేలా చేస్తాయి. అటువంటి శిక్షణ పొందిన, సమర్ధులైన యువకులను రిక్రూట్ చేసుకునే అవకాశాన్ని మహీంద్రా గ్రూప్ స్వాగతిస్తోంది. అగ్నిపథ్ను నిరసిస్తూ హింస చెలరేగడం నాకు బాధను కలిగించింది. అగ్నిపథ్లో పని చేసిన యువతకు మా మహీంద్రా సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఇలాంటి నైపుణ్యం కలిగిన యువతను కార్పొరేట్ సెక్టార్ కోరుకుంటుంది" అని ఆయన రాసుకొచ్చారు.
అయితే, ఆనంద్ మహీంద్రా ట్విట్ చేసిన వెంటనే ఓ నెటిజన్.. అగ్నివీరులకు మహీంద్రా గ్రూప్ ఎలాంటి పోస్ట్ ఇవ్వనుంది? అని ప్రశ్నించాడు. దానికి ఆనంద్ మహీంద్రా "అగ్నివీరులకు కార్పొరేట్ రంగంలో విస్తృత ఉపాధి అవకాశాలున్నాయి. నాయకత్వం, టీం వర్క్, దేహదారుడ్యంలో శిక్షణ పొందిన అగ్నివీరులు. కార్పొరేట్ పరిశ్రమకు వృత్తిపరమైన పరిష్కారాలను అందించగలరు. కార్యకలాపాల నుంచి పాలనా వ్యవహారాలు, సప్లయ్ చేసే మేనేజ్మెంట్ ఇలా అన్ని విభాగాల్లోనూ వారికి అవకాశాలుంటాయి" అని ఆయన సమధానం ఇచ్చారు.
మరోపక్క 'అగ్నిపథ్' పథకంపై గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనలకు మద్దతిస్తూ, నేడు పలు సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఓవైపు బంద్ కొనసాగతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం అగ్నిపథ్ పై వెనక్కి తగ్గట్లేదు. ఈ పథకం కింద నియామకాల కోసం త్రివిధ దళాలు నిన్న షెడ్యూళ్లను ప్రకటించాయి. ఈ క్రమంలో ఈ హింసాత్మక ఆందోళనలపై సోమవారం ఉదయం ఆనందర్ మహీంద్రా 'అగ్నివీరులకు' బంపర్ ఆఫర్ను ప్రకటించారు. ఈ పథకం కింద సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన వారికి తమ సంస్థలో పనిచేసే అవకాశం కల్పిస్తామని అన్నారు.