తెలుగులో బిగ్బాస్ షో రెండు సీజన్లు సక్సెస్ ఫుల్గా పూర్తి చేసుకుంది. ఇప్పుడు మూడో సీజన్కు రెడీ సిద్ధమవుతోంది. జూలైలోనే బిగ్ బాస్ 3 సీజన్ ప్రారంభించేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఈ షోకి హెస్ట్గా అక్కినేని నాగార్జునను ఫైనల్ చేశారని, దీనిపై కొద్దిరోజుల్లోనే అధికార ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ షోలో పాల్గొనే 17 మంది కంటెస్టంట్లు ఎవరనే ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.
సీజన్ 1లో అందరూ సెలబ్రిటీలే కంటస్టంట్లుగా వచ్చినా.. సీజన్ 2లో కొందరు సామాన్యులున్నారు. వారు కొంచెం వీక్ గా ఉండటంతో షో రేటింగ్స్ పై ప్రభావం పడటంతో.. సీజన్ 3లో మాత్రం అలాంటి రిస్క్ తీసుకునేందుకు బిగ్ బాస్ ముందుకు రావట్లేదు. ఫేమ్ ఉన్న సెలబ్రిటీలనే ఈసారి కంటెస్టంట్లుగా తీసుకోబోతున్నట్లు సమాచారం.
ఇందుకోసం ఇప్పటికే యాంకర్ శ్రీముఖిని బిగ్ బాస్ టీం సంప్రదించినట్లు సమాచారం. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, టీవీ షోలు, ఈవెంట్లు, సినిమాలు చేస్తూ.. శ్రీముఖి బిజీగా ఉంది. కాగా ఇటీవల ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చిన ‘పటాస్’ షో నుంచి బయటకు వచ్చిన విషయ తెలిసిందే. బిగ్ షోలో పాల్గొనేందుకే శ్రీముఖి ‘పటాస్’ షోకి బ్రేక్ తీసుకున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది.
అంతేకాదు అసలు పటాస్ షో నుంచి బ్రేక్ తీసుకుంటున్నానని వీడియో విడుదల చేసిన శ్రీముఖి.. అందుకు కారణమేంటో మాత్రం చెప్పలేదు. దీంతో బిగ్ బాస్ షో కోసమే శ్రీముఖి బయటకొచ్చిదని జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే నిజమైతే ఇన్నాళ్లు పటాస్ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన శ్రీముఖి.. ఇప్పుడు బిగ్ బాస్ తో అందర్ని అలరించడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.