రేపే మహా శివరాత్రి. శివ భక్తులకు అత్యంత పర్వదినం. భక్తులంతా ఆ పరమశివుడిని దర్శించుకునేందుకు దేవాలయాలకు వెళ్తారు. మన దేశంలో ఎన్నో ప్రసిద్ధ శివాలయాలుండగా.. అన్నీ వేటివవే ప్రత్యేకం. అయితే ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్లోని ఓ ప్రసిద్ధ శివాలయం విశిష్ఠత వెలుగులోకి వచ్చింది. దశాబ్దాలుగా మూసివేసిన ఆ దేవాలయాన్ని కేవలం మహాశివరాత్రి రోజున మాత్రమే తెరుస్తారు.
సోమేశ్వరాలయంగా పిలువబడే ఈ ఆలయం భోపాల్కు 48 కిలోమీటర్ల దూరంలో రైసెన్ జిల్లాలో ఉంది. 1,000 అడుగుల ఎత్తైన కొండపై ఆ శివాలయం ఉంది. 10 శతాబ్ధంలో ఈ ఆలయాన్ని నిర్మించగా.. 1283 సంవత్సరంలో జలాలుద్దీన్ ఖిల్జీ స్వాధీనం చేసుకున్నాడట. ఆ తర్వాత మాలిక్ కాఫుర్, మహమ్మద్ షా తుగ్లక్, సాహిబ్ ఖాన్లు సోమేశ్వరాలయాన్ని ఆక్రమించుకున్నారు. 1543లో షేర్ షా సూరి ఆ దేవాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సామాన్య ప్రజల కోసం ఆ దేవాలయాన్ని తెరవాలని 1974లో ఉద్యమం జరిగింది. దీని తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ప్రకాష్ సేథీ.. సోమేశ్వర దేవాలయానికి తాళం తీసి సామాన్య ప్రజలు వెళ్లేందుకు అనుమతినిచ్చారు. అయితే కేవలం శివరాత్రి రోజు మాత్రమే ఆ దేవాలయంలో పూజలు నిర్వహించేందుకు అనుమతించారు. ప్రస్తుతం ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ నిర్వహిస్తోంది. మహాశివరాత్రి రోజు 12 గంటలపాటు అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఆ దేవాలయాన్ని తెరుస్తారు. గతేడాది ఒక మతపరమైన కార్యక్రమంలో పండిత్ ప్రదీప్ మిశ్రా ఆ సోమేశ్వరాలయం గురించి ప్రస్తావించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది.