కరోనా సంక్షోభ సమయంలో తెలంగాణ రైతులు కష్టాలపాలు కాకుండా సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఆదుకున్నారని అందోల్ ఎమ్యెల్యే చంటి క్రాంతికిరణ్ కొనియాడారు. ఆయన ఈ రోజు రైతు బిడ్డలా పంచధరించి సీఎం పటానికి పాలాభిషేకం చేశారు. రైతులకు రుణమాఫీ డబ్బుతోపాటు రైతుబందు డబ్బులను కూడా ఒకేసారి జమ చేసినందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
జోగిపేట హనుమాన్ చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..‘అన్ని రకాల పంటలను ప్రభుత్వం మద్దతు ధరతో కొంటుంది. ఎవరూ భయపడాల్సిన పని లేదు..’ అని భరోసా ఇచ్చారు. ‘దేశంతోపాటు ప్రపంచమంతటా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కేసీఆర్ పెద్ద మనసుతో రైతులకు అండగా నేనున్నానని హామీ ఇచ్చారు. పంట పెట్టుబడి సహాయమే కాకుండా రైతు రుణమాఫీ చేయడం గర్వకారణం. ఇది చరిత్మాత్మక, సాహోసపేత నిర్ణయం. ఇంతటి ఆర్థిక సంక్షోభంలో కూడా రైతులకు ప్రజల గడువు కంటే ముందు డబ్బులు పంపిణీ చేయడం ముదావహం..’ అని అన్నారు. రైతులు ఎరువుల షాపుల్లో అప్పులు చేసి, మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి, జాగృతి నాయకులు భిక్షపతి మున్సిపల్ చైర్మన్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.