పొల్యూషన్…..మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇది. ఎక్కడికెళ్ళినా, ఏ నగరం చూసినా పొల్యూషన్ గుప్పిట్లో చిక్కుకుపోయే కనిపిస్తోంది. విదేశాల్లో సైతం ఈ సమస్య తప్పడం లేదు. కాకపోతే ఇండియా కన్నా చాలా తక్కువ ఉంటుంది అంతే. భారత్ లో మాత్రం ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయమే. ఏవో మారుమూల పల్లెటూర్లలో తప్ప మిగతా అన్ని చోట్లా కాలుష్యం తినేస్తూనే ఉంది. బయటకు వెళ్ళాలంటే భయంగానే ఉంటోంది. మాస్కులు, స్కార్ఫ్ లు ఎన్ని చుట్టుకు వెళ్ళినా కాలుష్యాన్ని తప్పించుకోవడం అవడం లేదు.
ఎయిర్ పొల్యూషన్ కారణంగా అనేక అనారోగ్యాలు మనల్ని ఎటాక్ చేస్తున్నాయి. రోజు రోజుకీ పెరుగుతున్న వాయు కాలుష్యం లక్షల మంది ప్రాణాలను సైతం బలితీసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒక్క 2019లోనే మన దేశంలో 9,07,000 మంది దీని కారణంగానే మృతి చెందినట్లు గ్లోబల్ లాన్సెట్ కౌంట్డౌన్ రిపోర్ట్-2021 పేర్కొంది. కాలుష్యం కారణంగా.. గాలిలో అనేక ప్రమాదకరమైన పదార్థాలు ఉంటాయి. CDC ప్రకారం, EPA కొన్ని ప్రమాదకర పదార్థాలను వాయు కాలుష్యానికి ప్రధాన కారణంగా పేర్కొంది. ఈ కాలుష్యాలు వాతావరణంలో కలసి, గాలిని కలుషితం చేస్తాయి. గాలిలో కార్బన్ మోనాక్సైడ్, లెడ్, నైట్రోజన్ ఆక్సైడ్, ఓజోన్, సల్ఫర్ డయాక్సైడ్, బెంజీన్ వంటి ప్రమాదక పదార్థాలు చేరి కలుషితం చేస్తున్నాయి. ఇవి ఊపరితిత్తులు, గుండె, శరీరంలో ఇతర అవవాలను దెబ్బతీస్తాయి.
పొల్యూషన్ కు చెక్ పెట్టడానికి కవర్ చేసుకోవడం ఎలాగో తప్పనిసరిగా చేయాలి. దాంతో పాటూ ఆహారంలో కూడా మార్పులు చేసుకుంటే కాలుష్యం మనల్ని దెబ్బ తీయకుండా ఉంటుంది. అలా మనల్ని కాపాడే పదార్ధాలు ఏంటో ఇప్పడు చూద్దాం.
అవిసె గింజలు:
ఫ్లాక్స్ సీడ్స్ అంటారు వీటిని. దాదాపు ఇవి ఇప్పడు అన్ని చోట్లా దొరుకుతున్నాయి. వీటివల్ల చాలా ఉపయోగాలున్నాయి. అవిసె గింజలలో ఫైటో ఈస్ట్రోజెన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఆస్తమా పేషెంట్స్ వారి డైట్లో అవిసె గింజలు చేర్చుకుంటే.. చాలా మంచిది. ప్రతిరోజూ 2 టీస్పూన్ల అవిసె గింజలను రాత్రంతా నానబెట్టి, ఉదయం తీసుకుంటే అన్ని రకాలుగా చాలా మంచిది.
పువ్వు కూరలు:
వీటిని క్రూసిఫరస్ కూరగాయలు అంటారు. కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకకలీ లాంటి కూరలు అన్నీ ఈ కుటుంబానికి చెందుతాయి. ఇందులో సల్ఫోరాఫేన్ ఉంటుంది. ఇది బెంజీన్ అనే ప్రమాదకరమైన పదార్ధాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాదు వీటిల్లో ఉండే విటమిన్ సి, బీటా కెరోటిన్ లాంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యునిటీని పెంచుతాయి.
ఉసిరి:
ఉసిరికాయ గొప్ప యాంటీ పొల్యూషన్ ఫుడ్. ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది గాలిలో ఉండే ప్రాణాంతక పదార్థాల వల్ల కలిగే సెల్యులార్ డ్యామేజ్ను నివారిస్తుంది. ప్రతి రోజూ వెజిటెబుల్ జ్యూస్లో ఓ ఉసిరి కాయ వేసుకుని తాగినా… ఒక ఉసిరికాయ తిన్నా అయినా మంచిదే.
పసుపు:
పసుపు దీని గురించి తెలియనది ఎవరికి. ఇది ఎంత మంచి యాంటీ బయోటిక్ అన్నది అందరికీ తెలిసినదే. అంతే కాదు పసుపులో కర్కుమిన్ ఉంటుంది, ఇది వాయుకాల్యుషం కారణంగా వచ్చే ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడుతుంది. కాలుష్యం వల్ల వచ్చే ఉపిరితిత్తుల ఇన్ఫెక్షన్ను నివారించడానికి ప్రతి రోజూ 500 mg కర్కుమిన్ సప్లిమెంట్ తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేశారు. అలాగే మన డైట్లో పసుపు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
క్యారెట్:
సిగరెట్లు, వాహనాల నుంచి వచ్చే పొగలో ఆక్రోలీన్ అనే అలెర్జీ పదార్థం ఉంటుంది. ఇది ఊపిరితిత్తులు, చర్మంపై ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. క్యారట్, సెలెరీ బెస్ట్ యాంటీ పోల్యూషన్ ఫుడ్స్ అని నిపుణులు అంటున్నారు. వీటిలో ఫైటోన్యూట్రియెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి తరచుగా మన డైట్లో తీసుకుంటే.. శరీరంలో ఆక్రోలీన్ అధికంగా పోగుపడకుండా ఉంటుంది.
చూశారుగా మనం రోజూ తీసుకునే ఆహారంలోనే మనకు తెలియని ఎన్నో గుణాలున్నాయి. మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూనే ఉన్నాయి.