ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాల్లో కొత్త రూల్ అమల్లోకి తెచ్చింది. ఈ కేటగిరీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్ధులు ఇక నుంచి తప్పనిసరిగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు (సీపీటీ) సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ టెస్టును ఏపీపీఎస్సీ, ఏపీ సాంకేతిక విద్యా మండలి నిర్వహిస్తుందని తెలిపింది. ఈ సీపీటీ పాస్ సర్టిఫికెట్ లేకుండా ఎవరూ కూడా గ్రూప్ 2, గ్రూప్3 సర్వీసుల్లో ఉద్యోగం పొందలేరంటూ అడ్హక్ నిబంధనలు జారీ అయ్యాయి. వంద మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులు 30 శాతం, బీసీలు 35 శాతం, ఓసీలు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంది.
డిజిటల్ పరికరాలు, ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్, కంప్యూటర్లు, ఇంటర్నెట్ తదితర అంశాలపై పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ ఉత్తర్వులలో పేర్కొన్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు నియమితులయ్యే వారంతా ఈ సీపీటీ పరీక్ష పాస్ కావాల్సిందేనని అందులో స్పష్టం చేశారు.