ఏపీ హైకోర్టు గురువారం కీలక తీర్పును ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) చట్టం ప్రకారమే.. రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని ఆదేశించింది. దీనికి సంబంధించి 6 నెలల్లోగా మాస్టర్ ప్లాన్ను పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దుపై దాఖలైన 75 వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.
‘రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదు. అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలి. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలి’ అని ఆదేశించింది. మాస్టర్ ప్లాన్లో ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయాలని తేల్చి చెప్పింది. అమరావతి నుంచి ఆఫీసులను తరలించకూడదని స్పష్టం చేసింది. భూములను ప్రభుత్వానికిచ్చిన రైతులు, వాటాదారులకు 3 నెలల్లోగా అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరచిన ప్లాట్లను అప్పగించాలని సర్కారుకు తేల్చి చెప్పింది.
అంతేకాకుండా రాజధాని అవసరాలకు తప్ప, ఇతర అవసరాలకు ఆ భూములను తాకట్టు పెట్టరాదని స్పష్టం చేసింది. అమరావతి రాజధానిపై వ్యాజ్యాలు దాఖలు చేసిన పిటిషనర్లకు ఖర్చుల కింద రూ.50 వేల చొప్పున చెల్లించాల్సిందిగా సర్కారును కోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో అమరావతి రైతుల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది.
మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అంటూ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అమరావతి పేరుతో 2022-23 బడ్జెట్ ప్రకారం నిధులు కూడా విడుదల చేసింది.