ఏపీ: నిరుద్యోగులకు జగన్ శుభవార్త..ఇక నుంచి ప్రతి జిల్లాలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు జగన్ సర్కార్ శుభవార్తను చెప్పింది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్నీ జిల్లాలో జాబ్ మేళాను నిర్వహించడానికి ప్రణాళికలు రెడీ చేశామని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కాసేపటిక్రితమే ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో సత్యనారాయణ తెలిపారు.
సీఈవో సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.." ఏపీలో ఉన్న ప్రతి జిల్లాలో ప్రతి శుక్రవారం ఒక్కో జిల్లా చొప్పున కనీసం ఒక జాబ్ మేళాను నిర్వహిస్తాం. యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో వచ్చే 12 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 312 జాబ్ మేళాలు నిర్వహించనున్నాం. ఇక నుంచి ప్రతి శుక్రవారం ఒక్కో జిల్లాలో కనీసం ఒక జాబ్ మేళా నిర్వహిస్తాం. ఈరోజే అందుకు సంబంధించిన జాబ్ మేళా క్యాలెండర్ను విడుదల చేశాం. కావున ఆయా జిల్లాలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి" అని ఆయన అన్నారు.
అనంతరం ఏపీఎస్ఎస్డీసీ సలహాదారు చల్లా మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ..'గడిచిన మూడేళ్లలో 14 లక్షల మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రతీ నియోజకవర్గం పరిధిలో స్కిల్హబ్స్ ప్రారంభిస్తున్నాం. ఇందులో భాగంగా తొలి విడతలో 66 హబ్స్ను ఆగస్టు 15న అందుబాటులోకి తీసుకు వస్తున్నాం. ఇక, ఈ విద్యా సంవత్సరంలో లక్ష మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం" అని ఆయన అన్నారు.