ఏపీ: మందుబాబులకు శుభవార్త..మరో 840 బార్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 840 బార్లను ఏర్పాటు చేయడానికి గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ-వేలం ద్వారా వీటిని వేలం వేయడానికి అధికారులు సిద్థమవుతున్నారు. ఈ 840 కొత్త బార్లకు సంబంధించిన పూర్తి వివరాలను కూడిన నోటిఫికేషన్ను ఎక్సైజ్ శాఖ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం.. "ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి 31 ఆగస్టు 2025 వరకు బార్లకు అనుమతినిస్తూ లైసెన్సులు మంజూరు చేస్తారు. ఈ లైసెన్స్ల కోసం నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి గడువు ఇచ్చారు. ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకుని ప్రాసెసింగ్ ఫీజుతోపాటు నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజును మాత్రం ఈ నెల 28వ తేదీ వరకు చెల్లించొచ్చు. దరఖాస్తులు సమర్పించేందుకు జోన్ల వారీగా తేదీలు నిర్ణయించారు. రాష్ట్రంలో అత్యధికంగా విశాఖపట్టణంలో 128 బార్లు కొత్తగా ఏర్పాటు కానుండగా, ఆ తర్వాతి స్థానంలో విజయవాడ (110), గుంటూరు (67), నెల్లూరు (35) ఉన్నాయి" అని అధికారులు పేర్కొన్నారు.