ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో సంచలన తీర్పు ఇచ్చింది. ఇటీవలే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా విధులు నిర్వహించి, రిటైర్ అయిన ఐఏఎస్ అధికారి చినవీరభద్రుడికి 4 వారాల జైలు శిక్షతోపాటు రూ.2 వేల జరిమానా విధించింది. అనంతరం శిక్ష అమలును రెండు వారాలపాటు నిలుపుదల చేయాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరడంతో, రెండు వారాలపాటు నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
గతంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ హోదాలో విధులు నిర్వహించిన చినవీరభద్రుడు.. ఓ మెమో జారీ చేశారు. ఆ మెమోతో ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్)లుగా ఉన్న ఉపాధ్యాయులు బీపీఈడీ కోర్సును అభ్యసించేందుకు అవకాశం ఉండదు. ఆ కోర్సు సర్టిఫికెట్ లేని కారణంగా తమ పదోన్నతులకు ఇబ్బంది కలుగుతోందని ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన ఎస్జీటీలు గతేడాది హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్పై విచారించిన హైకోర్టు.. మెమోను రద్దు చేస్తూ ఎస్జీటీలు బీపీఈడీ కోర్సు చేసేందుకు వీలుగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
రోజులు గడుస్తున్న హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అమలుకాకపోవడంతో ఎస్జీటీలు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం.. పాఠశాల విద్యాశాఖపై తీవ్రంగా మండిపడింది. వివాదానికి కారణమైన చినవీరభద్రుడికి 4 వారాల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానాను విధించింది. విచారణకు హాజరైన చినవీరభద్రుడు, హైకోర్టుకు క్షమాపణలు చెప్పినా పట్టించుకోలేదు.