ఆంధ్రప్రదేశ్లో రేపు మెగా మేళాకు అన్నీ ఏర్పాట్లు సిద్దమైయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న రైతన్నలకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను అందించేందుకు జగన్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఒకేసారి 5,177 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల (సీహెచ్సీ)ను ప్రారంభించనుంది. రైతుల కమిటీలతో కూడిన ఈ సీహెచ్సీల ద్వారా ఆ ప్రాంత రైతులకు ఎక్కువ ఏ యంత్ర పరికరాలు అవసరమో వాటిని అందించనుంది. తొలిసారిగా ప్రభుత్వం ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను అందుబాటులోకి తెస్తోంది. మంగళవారం (7వ తేదీ) గుంటూరు చుట్టుగుంట సెంటర్లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీటి పంపిణీ చేస్తాడని.. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ హార్వెస్టర్లను జగన్ మోహన్ రెడ్డి పంపిణీ చేయనున్నారని ఆయన పేర్కొన్నారు.
కాకాణి మాట్లాడుతూ..”వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా చిన్న, సన్నకారు రైతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సీహెచ్సీలను ఏర్పాటు చేస్తోంది. ఆర్బీకే స్థాయిలో రూ.1,612.50 కోట్లతో 10,750 సీహెచ్సీలను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ప్రతి సీహెచ్సీకి ఓ ట్రాక్టర్ను అందుబాటులోకి తెస్తున్నాం. ఇందుకోసం ఏడుకు పైగా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వందకు పైగా మోడళ్లు ఉన్నాయి. హార్స్ పవర్ను బట్టి రైతులు ఎంపిక చేసుకున్న ట్రాక్టర్ విలువలో 40 శాతం (రూ.2లక్షల నుంచి రూ.3.4లక్షల) వరకు సబ్సిడీగా అందిస్తున్నాం. తొలి విడతగా మండలానికి కనీసం ఆరు చొప్పున 3,800 ట్రాక్టర్లను ఇస్తాం. కంబైన్డ్ హార్వెస్టర్ల మాదిరిగానే ఈ ట్రాక్టర్లకు కూడా జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) పరికరాలను అమర్చుతున్నారు. విత్తు నుంచి కోతల వరకు కూలీల కోసం రైతులు పడుతున్న ఇక్కట్లకు తెరదించేందుకే గ్రామ స్థాయిలో ఆర్బీకేలకు అనుబంధంగా కస్టమ్ హైరింగ్ సెంటర్స్ను తీసుకొస్తున్నాం. రైతుల నుంచి వస్తున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఆర్బీకేలోనూ ఓ ట్రాక్టర్ అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతోనే తొలి విడతగా 3,800 ట్రాక్టర్లను పంపిణీ చేయబోతున్నాం” అని ఆయన అన్నారు.