ముంబై జైల్లో ఎలకలు ఉన్నాయ్.. నన్ను అప్పగించకండి..
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్లో తల దాచుకుంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారతదేశానికి అప్పగించవద్దని అతని న్యాయవాదులు వెస్ట్ మినిస్టర్ కోర్టుకు విన్నవించుకున్నారు. నీరవ్ మోదీని ఉంచే ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఎలుకలు, క్రిమి కీటకాలున్నాయని, అలాంటి జైలులో ఉంచడం మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు. నీరవ్ మోదీని భారత్కు అప్పగించొద్దని వారు వాదిస్తున్నారు. జైలు ప్రాంగణంలో శుభ్రత లేదని, మురుగు కాల్వ కూడా ప్రవహిస్తుందని, బ్యారక్లో డ్రైనేజీ కూడా లేదని, జైలు సమీపంలో మురికివాడ కూడా వెలసిందని నీరవ్ న్యాయవాదులు జడ్జీకి విన్నవించారు. అలాగే నీరవ్ మోదీ మానసిక ఆరోగ్య పరిస్థితి బాగాలేదని.. అతన్ని ఆ జైలుకు తరలిస్తే అక్కడ మానసిక వైద్యుడు కూడా లేరని తెలిపారు.
అయితే భారత అధాకారులు నీరవ్ న్యాయవాదుల వాదనను కొట్టి పారేస్తున్నారు. ఈ మేరకు వారికి వ్యతిరేకంగా కౌంటర్ దాఖలు చేశారు. నీరవ్ మోదీని తమకు అప్పగిస్తే ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఆర్థిక నేరస్థుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన 12వ నంబర్ బ్యారక్లో ఆయనను ఉంచుతామని సదరు వెస్ట్ మినిస్టర్ కోర్టు మెజిస్ట్రేట్కు జైలు వీడియో పంపించారు. ఆర్థర్ రోడ్ జైలులో ఎలుకలు, క్రిమికీటకాలు లేవని, ఒపెన్ డ్రైనేజీ కూడా లేదని, ఖైదీకి సెల్లో తగినంత స్థలం ఉందని భారత అధికారులు స్పష్టంచేశారు. దీంతో నీరవ్ మోదీని భారత్కు అప్పగించాలన్న విజ్ఞప్తిపై జరుగుతున్న కేసు విచారణ సెప్టెంబరుకు వాయిదా వేస్తూ.. వెస్ట్మినిస్టర్ కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.