వరుడు జనాభా లెక్కల్లో లేడని పెళ్లి రద్దు!
పీటల దాకా వచ్చిన పెళ్లిళ్లు ఎందుకు ఆగిపోతుంటాయి? కట్నం తక్కువనో, లేకపోతే వరుడికి చెడు అలవాట్లు ఉన్నాయని చివరి క్షణంలో తెలియడం వల్లో, ఇలాంటి మరికొన్ని కారణాలతోనే కదా! కానీ అతని పెళ్లి మాత్రం జనాభా లెక్కల తతంగం వల్ల ఆగిపోయింది. జాతీయ పౌరసత్వ రిజిస్టర్(ఎన్ఆర్సీ)లో అతని పేరు కనిపించకపోవడంతో వధువు కుటుంబం ఈ పెళ్లి జరగదు అని తేల్చేసింది.
అస్సాంలోని సిల్చార్ జిల్లా నయాగ్రాంలో ఈ వింత జరిగింది. దిల్వార్ హుసేన్ లస్కర్(30) ఓ యువతితో కలసి ఉంటున్నారు. వీరిద్దరూ తమకు పెళ్లి చెయ్యాలని తమ కుటుంబాలను కోరారు. పెళ్లికి మొదట వారు అంగీకరించారు. కానీ తర్వాత వధువు కుటుంబ సభ్యులు వెనకంజ వేశారు. ఎన్ఆర్సీ వివాదం నేపథ్యంలో యువతి కుటుంబం వధువు కుటుంబం వరుడి గురించి ఆరా తీసింది. అతని పేరు ఎన్ఆర్సీలో లేకపోవడంతో, భవిష్యత్తులో సమస్యలు వస్తాయని పెళ్లికి ససేమిరా అంది. ‘ఎన్ఆర్సీలో దిల్వర్ పేరు లేదు. నేను నా కూతురిని అతనికిచ్చి పెళ్లి చేస్తే ఆమె కూడా పౌరసత్వ విషయంలో ఇబ్బందులు పడుతుంది’ అని వధువు తండ్రి కుతుబుద్దీన్ భర్హూయా వివరించాడు. అంతటితో ఆగకుండా దిల్వర్ తన కుమార్తెను కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అస్సాంలో నివసిస్తున్న 40 లక్షల మందికి ఎన్ఆర్సీలో చోటు దక్కేలేదు. వీరిలో కొందరు బంగ్లాదశ్ నుంచి వలస వచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.