టాలీవుడ్ హీరో బాలకృష్ణ తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. కేవలం నటుడుగా మాత్రమే కాదు.. ఓ దర్శకుడిగా కూడా తన సత్తాను ప్రదర్శించే ప్రయత్నం చేశారు. దీని కోసం ‘నర్తనశాల’ సినిమా రీమేక్ చేస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా ఈ నెల 24న దసరా కానుకగా విడుదల కాబోతోంది. ఎన్బీకే థియేటర్లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయనున్నారు. అయితే కేవలం 17 నిమిషాల నిడివితో మాత్రమే ఈ సినిమా రాబోతోంది.
ఈ సినిమాలో బాలయ్యా అర్జునిడిగా కనిపించగా.. దివంగత నటి సౌందర్య ద్రౌపది పాత్ర పోషించింది. భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ కుమార్ ఉన్నారు. షూటింగ్ సమయంలోనే సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారు. అప్పటి నుంచి ఈ సినిమాను ఆయన పక్కన పెట్టేసారు. ద్రౌపది పాత్రలో సౌందర్యను తప్ప మరో హీరోయిన్ను పెట్టలేక దాన్ని ఇంత కాలం పట్టించుకోలేదు. చాలా కాలంగా ఈ సినిమా కోసం పలువురు పట్టుబట్టడంతో షూటింగ్ పూర్తి చేసిన 17 నిమిషాల సన్నివేశాలను ప్రదర్శించనున్నారు. దీని ద్వారా వచ్చే డబ్బులో కొంత భాగాన్ని ట్రస్ట్ కోసం ఉపయోగిస్తామని బాలయ్య తెలిపారు. దీంతో ఆయన దర్శకత్వ పటిమ ఎలా ఉందో ఈ సినిమాలో చూడాలని ఆయన అభిమానులు తెగ ఆసక్తి చూపుతున్నారు.