తెలంగాణ సీఎం కేసీఆర్కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. వెంటనే వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి జులై ఒకటో తేదీ నుంచి ఉద్యోగులకు పెరిగిన జీతాలు చెల్లించాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఈ నెల 9న జరగబోయే కేబినెట్ సమావేశంలో పీఆర్సీ ఏర్పాటుతో పాటు మూడు నెలల్లో నివేదిక తెప్పించుకుని జులై ఒకటి నుంచి కొత్త పీఆర్సీ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇంకా కొన్ని నెలలు మాత్రమే గడువు మిగిలుందని, అయినా హామీలను అమలు చేయకపోవడం ప్రజలను దారుణంగా మోసగించడమేనని విమర్శించారు. రుణమాఫీ, ఫ్రీ యూరియా , నిరుద్యోగ భృతి, దళిత బంధు, దళితులకు మూడెకరాలు, ఇంటికో ఉద్యోగం, గిరిజన బంధు, గిరిజన రిజర్వేషన్లు, చేనేత బంధు, పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు, సొంత జాగా ఉన్నవారికి రూ. 3 లక్షల ఆర్దిక సాయం వంటి హామీలను ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదు? అని నిలదీశారు.
ఈ నెల 9 న జరుగబోయే కేబినెట్ సమావేశంలో ప్రజలకిచ్చిన హామీలన్నింటిపై చర్చించి తక్షణమే అమలయ్యేలా నిర్ధిష్ట కార్యాచరణ రూపొందించాలని సంజయ్ తెలిపారు. లేనిపక్షంలో ఆయా హామీల అమలు కోసం బీజేపీ పక్షాన ప్రజలతో కలిసి భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. జరుగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.