శనివారం రోజున తెలంగాణ ఆడపడుచులు ఘనంగా సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఉన్న తెలంగాణ మహిళలు ఈ పండుగ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఖతార్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఖతార్లో భారత రాయబారి దీపక్ మిత్తల్, వినోద నాయక్, ఏపీ మణికంఠన్, బాబు రాజన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దీపక్ మిత్తల్ దీపం వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ వేడుకలను తెలంగాణ జాగృతి ఖతార్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని ఆధ్వర్యంలో నిర్వహించారు. కరోనా వైరస్ నిబంధనలను పాటిస్తూ ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని గౌరమ్మను వేడుకున్నారు. ఈ సందర్భంగా గత చేనేత దినోత్సవ సందర్భంగా నిర్వహించిన చాలెంజ్ కార్యక్రమం విజేతలకు తెలంగాణ నుంచి ఖతార్కు ప్రత్యేకంగా తెప్పించిన చేనేత వస్త్రాలను బహూకరించారు.