దర్శకుడు విశ్వనాథ అంటే ఒక బ్రాండ్. కళలకు సంబంధించిన సినిమాలు అంటే టక్కున గుర్తొచ్చే మొట్టమొదటి వ్యక్తి. ఈయన తీసిన సినిమాలన్నీ దాదాపై హిట్ లే. ప్రతీ నటుడు విశ్నాథ్ దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చెయ్యాలనుకుంటాడు. అయితే ఈ యనకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో, అంతేమంది ఈయన సినిమాలను విరోధించేవారు కూడా ఉన్నారు.
ఒక వర్గానికి సంబంధించిన సినిమాలే తీస్తారని, కళలన్నీ ఒక వర్గానికే చెందినవి అని చెప్తారని అంటారు. బ్రాహ్మణ పక్షపాతి అని పేరు. అయితే ఎవరెన్ని అనుకున్నా తన చేయాల్సింది చేసుకుంటూ పోయారు విశ్వనాథ. చివరి వరకూ సినిమానే శ్వాసించారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన ఐదు చిత్రాలు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకున్నాయి. మరి ఆ సినిమాలేంటో, వాటి వివరాలు ఒకసారి చూద్దామా.
విశ్వనాథ దర్శకత్వం వహించిన శంకరాభరణం, సప్తపది, స్వాతిముత్యం, సూత్రధారులు, స్వరాభిషేకం సినిమాలను జాతీయ అవార్డులు వరించాయి.
శంకరాభరణం
పాటలు, డాన్సులు పెట్టి సినిమా తీస్తే ఎవడు చూస్తాడు. ఈ సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతంది అన్నారు. తీస్తున్నన్నాళ్ళూ సినిమా గురించి ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. కానీ ఒకసారి రిలీజ్ అయ్యాక ఈ సృష్టించిన ప్రభంజం అంతా ఇంతా కాదు. కమర్షియల్ సినిమాల్లా కాకుండా మామూలుగా తీసిన ఈ సినిమా తెలుగు ప్రజల మనసు దోచుకుంది. ఇందులోని పాటలు మారుమోగిపోయాయి. ఎంతలా అంటే దేశం మొత్తం వినిపించేలా. అందుకే ఈ సినిమాను జాతీయ అవార్డు కూడా వరించింది. ఈ సినిమా విడుదల అయ్యాక చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు సంగీతం, డాన్సులు నేర్పించారంటే అతిశయోక్తి కాదు.
జె.వి సోమయాజులు ముఖ్య పాత్రలో నటించిన శంకరాభరణం సినిమా 1980లో విడుదల అయింది. ఈ సినిమాకు మొత్తం నాలుగు జాతీయ అవార్డులు వచ్చాయి. బెస్ట్ పాపులర్ ఫిల్మ్ హోల్ సమ్ ఎంటర్టైన్ మెంట్(స్వర్ణ కమలం, 2 లక్షల నగదు), ఉత్తమ సంగీత ధర్శకుడిగా కె.వి మహదేవన్ కు రజత కమలం, 50 వేలు, ఉత్తమ గాయకుడిగా ఎస్పీబీకి రజత కమలం, 50 వేలు, ఉత్తమ గాయనిగా వాణీ జయరామ్…రజత కమలం, 50వేలు అందుకున్నారు.
సప్తపది:
కుల వ్యవస్థకు వ్యతిరేకంగా తీసిన సినిమా సప్తపది. ఏ బ్రాహ్మణ కులమైతే మిగతా కులాలను చిన్నచూపు చూస్తుందో అందులో ఉన్న వ్యక్తే , తన మనమరాలిని వేరే కులం వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేయడం ఈ సినిమా కథ. మనుషుల కన్నా కులాలు ముఖ్యం కాదని నిరూపించడానికి చేసిన ప్రయత్నం. జె.వి. సోమయాజులు, సబిత, అల్లు రామలింగయ్య ప్రధాన పాత్రలు చేశారు. ఇది కూడా సంగీతం, నృత్యం ప్రధానంగా ఉండే చిత్రం. 1981లో ఇది విడుదల అయింది. దీనికి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా భావించే నర్గీస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు వచ్చింది.
స్వాతిముత్యం:
విశ్వనాథ్ సినిమాల్లో మరో పాపులర్ మూవీ స్వాతిముత్యం. కమల్ హసన్, రాధిక జంటగా నటించిన ఈ సినిమా పునర్వివాహం మీద చర్చిస్తుంది. కమల్ హసన్ విశ్వరూపానికి ఈ సినిమా ఓ నిదర్శనం. రాధిక కూడా అదే లెవల్ యాక్ట్ చేసారు. తెలుగు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ గా ఈ సినిమా జాతీయ అవార్డు గెలుచుకుంది. అంతే కాదు ఎంతో మంది క్రిటిక్స్ ప్రశంసలను కూడా అందుకుందీ స్వాతిముత్యం.
సూత్రధారులు:
హింస కన్నా, అహింసే ఎక్కువ పనిచేస్తుందని చాటి చెప్పే చిత్రం ఇది. చదువు గొప్పదనాన్ని కూడా చాటి చెప్పే ప్రయత్నం చేశారు విశ్వనాథ ఇందులో. నాగేశ్వర్రావు, భానుచందర్, మురళీమోహన్, సత్యనారాయణ, సుజాత, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలుగా చేసిన ఈ మూవీ 1989లో విడుదల అయింది. ఈ సినిమా కూడా తెలుగులో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ గా జాతీయ అవార్డ్ పొందింది.
స్వరాభిషేకం:
సినిమాలు మారిపోయాయి. కొత్త వాళ్ళు వచ్చారు. పాత అంతా కొట్టుకుపోయింది. అలాంటి సమయంలో విడుదల అయిన సినిమా స్వరాభిషేకం. అన్నదమ్మలు అనుబంధం, సంగీతం కళ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో స్వయంగా విశ్వనాథే నటించారు. మరో ముఖ్య పాత్రల్లో హీరో శ్రీకాంత్, లయ చేశారు. 2004లో వచ్చిన ఈ సినిమా రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. తెలుగులో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును, ఉత్తమ సంగీత దర్శకుడిగా విద్యాసాగర్ జాతీయ అవార్డును కైవశం చేసుకున్నారు.
ఎవరెన్ని అనుకోని, ఆయన సినిమాలు ఎలా ఉండనీ గానీ….ఒక తరం దర్శకులకు గురువు విశ్వనాథ్. ఒక సినిమాను ఎలా తీయొచ్చో ఆయన సినిమాలు చూసి నేర్చుకున్న వాళ్ళూ ఎందరో ఉన్నారు. ఇప్పటికీ ఆయన తీసిన ఎన్నో సినిమాలు తమకు ఇన్సిరేషన్ అని చెప్పుకునేవాళ్ళూ ఎంతో మంది ఉన్నారు. 92 ఏళ్ళు సంపూర్ణ జీవితం అనుభవించి మరణించిన కె.విశ్వనాథ్….తెలుగు సినిమాలో ఎప్పటికీ చెరిగిపోని ఒక అధ్యాయం.
ఇవి కూడా చదవండి :
కళాతపస్వి గురించి ఆసక్తికరమైన విషయాలు..
శంకరాభరణాన్ని 25సార్లు చూశా.. కేసీఆర్