Home > Featured > భోలక్‌పూర్ బంగారు లడ్డు వేలం.. ఎంత పలికిందంటే.. 

భోలక్‌పూర్ బంగారు లడ్డు వేలం.. ఎంత పలికిందంటే.. 

Bholakpur

ఓవైపు వినాయక నిమజ్జనాలు.. మరోవైపు వినాయక లడ్డుల వేలంపాటలు సమవుజ్జీగా సాగుతున్నాయి. వివిధ గణపతుల వద్ద లడ్డూల ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. దీంతో హైదరాబాద్‌లోని గణపతి మండపాలు సందడి చేస్తున్నాయి. ఈక్రమంలో భోలక్‌పూర్ గణపతి బంగారు లడ్డూ వేలంపాట చాలా కోలాహలంగా సాగింది. శ్రీసిద్ధివినాయక భగత్‌సింగ్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో భోలక్‌పూర్‌లో వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. అసోసియేషన్‌ నిర్వాహకులు బుధవారం స్వామివారి ప్రసాదం లడ్డూను వేలం పాట నిర్వహించారు. రూ.5001 నుంచి ప్రారంభమైన వేలం పాట రూ.7.56లక్షతో ముగిసింది. స్థానిక చేపల విక్రయ వ్యాపారి బైరు విష్ణుప్రసాద్‌ ఈ బంగారు లడ్డూను దక్కించుకున్నారు. ఈ ఏడాది రూ.5 లక్షల విలువ చేసే 123గ్రాముల బంగారం లడ్డూను నిర్వాహకులు తయారు చేయించారు. నిమజ్జనానికి ఒక రోజు ముందు వేలంపాట నిర్వహించడంతో భక్తులు పోటాపోటీగా పాల్గొన్నారు.

ప్రసాదం లడ్డూతో పాటు ఆకర్షణ గొల్పేందుకు బంగారం లడ్డూను వేలంలో ఉంచడం ఇక్కడి ప్రత్యేకత. గతేడాదితో పోలిస్తే ఈసారి లడ్డూ తక్కువ ధర పలకడం గమనార్హం. ఈ వేలం కార్యక్రమానికి ముఖ్య అతిథులగా ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. గతేడాది ఏర్పాటు చేసిన వేలంపాటలో 120 గ్రాముల బంగారు లడ్డూను స్థానికుడు కె.భాస్కర్‌ రూ.8.1లక్షలకు సొంతం చేసుకున్నారు.

Updated : 11 Sep 2019 6:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top