గోవాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా సాగాయి. మేమంటే మేము అంటూ పోటాపోటీగా నడిచాయి. 40 సీట్లున్న గోవా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 21 సీట్లలో విజయం సాధిస్తే, ఆ పార్టీ పూర్తి మెజారిటీ సాధించినట్లే. అయితే విడుదలైన ఫలితాల్లో బీజేపీ 20 సీట్లలో విజయం సాధించింది. మెజారిటీకి కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉంది.
ఇక వెలువడిన ఫలితాలలో ఇప్పటివరకూ 12 సీట్లను కాంగ్రెస్ గెలుచుకోగా, ఆప్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు చెరో రెండు సీట్లను గెలుచుకున్నాయి. స్వతంత్రులు ఏకంగా నాలుగు సీట్లలో విజయం సాధించారు. ఈ క్రమంలో ఓ స్వతంత్ర అభ్యర్థి తాను గెలిచిన వెంటనే తన మద్దతును బీజేపీకి ప్రకటించారు. బిచోలిమ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రముఖ కంటివైద్య నిపుణుడు డా. చంద్రకాంత్ షెత్యే నాటి ఫలితాల్లో విజయం సాధించారు.
అంతేకాకుండా ఎన్నికల్లో విజయం సాధించిన మరుక్షణమే మీడియా ముందుకు వచ్చిన చంద్రకాంత్ తాను బీజేపీకి మద్దతు పలుకుతున్నట్లుగా ప్రకటించారు. అప్పటికే 20 సీట్లు గెలుచుకున్న బీజేపీ..చంద్రకాంత్ మద్దతుతో సంపూర్ణ మెజారిటీ సాధించినట్టే. దీంతో మరోమారు గోవాలో బీజేపీ ప్రభుత్వమే పరిపాలన సాగించనుంది.