ఆదివారం జరిగిన టీమిండియా – పాక్ మ్యాచ్ పై బీజేపీ నాయకురాలు, నటి విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓడిందని నిరాశ పడటం పూర్తిగా అర్థరహితమన్నారు. భారత్తో ఎక్కువగా ఓడిపోతూ వస్తున్న పాక్లో వారి విజయాన్ని సంబరం చేసుకోవడం వాళ్ళకి బాగుంటుంది కానీ, మనం బాధపడటంలో ఏమాత్రం అర్థం లేదని పేర్కొన్నారు. భారత అభిమానులు ఈ ఓటమికి ఏ మాత్రం విలువ ఇచ్చినా భారత్కి పాక్ సమఉజ్జీయే అని అంగీకరించినట్టే అవుతుందన్నారు.
మన దేశంలో ఉగ్రవాదానికి ఊతమిస్తూ మనని నిరంతర శత్రువుగా చూస్తూ తన ఆర్థిక వ్యవస్థని నాశనం చేసుకున్న పాకిస్తాన్.. దారుణంగా అప్పులపాలై చివరికి జూలోని జంతువుల్ని కూడా అమ్ముకుంటుంది. ఏ విషయంలోనూ మనకి సరితూగని పాకిస్తాన్ ఏదో ఒక మ్యాచ్లో టీమిండియాపై గెలిచినంత మాత్రాన అదేదో పెద్ద విషయం అన్నట్టు చూడటం మన స్థాయికి తగని వ్యవహారం. ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్లకి మీడియా కూడా అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు. ఈ ఒక్క క్రికెట్ కోసం ఇది మాత్రమే ఆట అన్నట్టు పాక్ మాత్రమే మనకి పోటీ అన్నట్టు వేరే దేశాలు, ఇంకే ఆటలు లేనట్టు భావించే ప్రయాసకు కోట్లాది భారతీయుల్ని గురి చెయ్యడం అసమంజసం. మన టీమిండియా రికార్డులకి రికార్డులే తిరగరాసింది.. రాస్తుంది అంటూ విజయశాంతి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.