సాయిపల్లవి క్షమాపణలు చెప్పకపోతే.. దాడి చేస్తాం: రాజాసింగ్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. హీరోయిన్ సాయిపల్లవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాటపర్వం సినిమా కోసం కమ్యూనిస్టు పుస్తకాలు చదివి ఆమె మైండ్ పాడైందని అన్నారు. హిందువులపై కామెంట్లు చేసిన సాయిపల్లవి బహిరంగ క్షమాపణలు చెప్పాలని, అలా కానీ పక్షంలో ఆమెను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు.
సాయిపల్లవి ఏమన్నది.?
విరాట పర్వం మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా సాయిపల్లవి గోసంరక్షకుల దాడులపై, కశ్మీర్ ఫైల్స్పై కామెంట్స్ చేశారు. దాడులు ఎక్కడైనా దాడులేనని, అది కశ్మీర్ అయినా, గో సంరక్షణలో అయినా ఒక్కటేనని వ్యాఖ్యానించారు. కశ్మీరీపండిట్లపై జరిగిన దాడిని కశ్మీర్ ఫైల్స్ లో చూపించారు. మరి ముస్లిం అయినందుకు ఓ డ్రైవర్పై దాడిని కూడా అలాగే చూడాలని చెప్పారు. వ్యక్తులు ఏ మతానికి చెందినా, ఏ వాదాన్ని నమ్మినా మానవత్వాన్ని మర్చిపోతే ప్రయోజనం లేదంటూ సాయిపల్లవి చేసిన కామెంట్స్పై గోసంరక్షకులు, భజరంగ్దళ్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ.. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే సహించేది లేదని, జనం తిరగబడి కొడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హిందువులపై కామెంట్లు చేస్తే దాడి చేస్తాం: రాజాసింగ్
అంతటితో ఊరుకోక.. వాస్తవాలు మాట్లాడే దమ్ము సాయి పల్లవికి లేదని, కాశ్మీర్ కి వెళ్లి పండితులను కలిస్తే జరిగిన ఘోరాలు తెలుస్తాయని ఆయన అన్నారు. తెలంగాణ, ఏపీ అన్ని పోలీస్ స్టేషన్లలో సాయి పల్లవిపై ఫిర్యాదులు చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఒకరిని అరెస్ట్ చేస్తే ఇంకెవర్వరు హిందువుల జోలికి రారని పేర్కొన్నారు. పాపులర్ కావడానికి సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, బీజేపీ అనుంబంధ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. మీకు దమ్ముంటే ముస్లింలపైనా, క్రిస్టియన్స్పైనా కామెంట్స్ చేయండి. అంతేకానీ ఏం చెయ్యరు కదా అని హిందువులపై కామెంట్స్ చేస్తే దాడులు తప్పవని హెచ్చరించారు రాజాసింగ్.