తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలైన విషయం తెలిసిందే. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేదాకా సభ నుంచి తమను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ, బీజేపీ ఎమ్మెల్యేలు ఎం.రఘునందన్రావు, ఈటల రాజేందర్, రాజాసింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై గురువారం విచారణ చేపట్టిన జస్టిస్ షమీమ్ అక్తర్ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. సభ ముగిసే వరకు సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది.
రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా తమను సభ నుంచి సస్పెండ్ చేశారని, ఆ ఉత్తర్వులను వెంటనే కొట్టేసి, తాము అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును కోరారు. సస్పెన్షన్ తీర్మానం, వీడియో రికార్డులు సమర్పించేలా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని కోరారు. ఈ వ్యవహారంపై బుధవారం తొలి విడత వాదనలు విన్న న్యాయస్థానం అసెంబ్లీ కార్యదర్శిని వివరణ కోరింది. నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన శాసనసభ స్పీకర్… నిబంధనలు పాటించకుండా బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేశారని వారి తరపు న్యాయవాది లాయర్ దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించారు.