కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు వ్యతిరేకంగా మంగళవారం రాజ్యసభలో బీజేపీ సభ్యులు ఆందోళకు దిగారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ.. అంతకుముందు ఖర్గే ‘కుక్క’ తో పోల్చుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా రాజస్థాన్లోని అల్వార్లో జరిగిన ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ.. ‘‘దేశం కోసం కాంగ్రెస్ ఎంతో చేసింది. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీతోపాటు మరెందరో కాంగ్రెస్ నాయకులు ప్రాణ త్యాగాలు చేశారు. దేశం కోసం బీజేపీ నేతలు కాదు కదా.. కనీసం వాళ్ల ఇళ్లలోని ఒక్క కుక్క కూడా ప్రాణాలు కోల్పోలేదు. అయినా కూడా వాళ్లు.. దేశభక్తులనే చెప్పుకుంటారు. మేమేదైనా అంటే దేశద్రోహులుగా ముద్ర వేస్తారు’’ అని విమర్శలు గుప్పించారు.
ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. మంగళవారం పార్లమెంట్ ప్రారంభం కాగానే.. బీజేపీ నేతలు ఖర్గే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆందోళన లేవనెత్తారు. కేంద్రమంత్రులు పీయూష్ గోయెల్తో పాటు కిరణ్ రిజుజు, ప్రహ్లాద్ జోషి.. ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అయినా ఖర్గే మాత్రం తగ్గలేదు. వారు చెబుతున్న విషయంపై తానేమీ పార్లమెంట్లో అలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. పార్లమెంట్ బయట తాను చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చించాల్సిన అవసరం లేదని అన్నారు. బీజేపీ నేతలకు ప్రతి దానికి క్షమాపణ అడగటం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.