ఏదో సరదాగా కాసేపు బ్యాటింగ్ చేద్దామనుకుని.. సొంత పార్టీ కార్యకర్త తల పగులగొట్టాడు బీజేపీ నేత, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. అయితే అది కావాలని చేసింది కాదు. మంత్రి కొట్టిన షాట్ను ఆ కార్యకర్త క్యాచ్ పట్టబోయి, కుట్లు పడేలా తలకు గాయం చేసుకున్నాడు. మధ్యప్రదేశ్లోని ఇటౌరాలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఇటౌరాలో కొత్తగా ఓ స్టేడియం నిర్మించింది. దీనిని ఇటీవలే ప్రారంభించగా.. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అక్కడ కాసేపు సరదాగా బీజేపీ కార్యకర్తలతో క్రికెట్ ఆడారు.
Local BJP worker Vikas Mishra hurt on forehead while trying to catch the ball hit by union minister Jyotiraditya Scindia in Rewa district of MP. After inaugurating cricket stadium in Itaura (Rewa) showcased his batting skills. @NewIndianXpress @TheMornStandard @santwana99 pic.twitter.com/S2VJQd4yKJ
— Anuraag Singh (@anuraag_niebpl) February 15, 2023
ఈ క్రమంలో ఆయన బ్యాటింగ్ చేస్తుండగా కొట్టిన బంతిని క్యాచ్ పట్టేందుకు వికాస్ మిశ్రా అనే బీజేపీ కార్యకర్త ప్రయత్నించాడు. కానీ అది నేరుగా వచ్చి అతడి తలను తాకింది. దీంతో అతని తలకు గాయమై రక్తమోడింది. వెంటనే ఆటను ఆపేసిన కేంద్ర మంత్రి.. అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో బీజేపీ నేతల వికాస్ను ఆస్పత్రికి తరలించగా.. తలకు కుట్లు పడ్డాయి. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది.
స్థానిక బీజేపీ కార్యకర్త ధీరజ్ ద్వివేది ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. స్టేడియం ప్రారంభించిన తర్వాత స్నేహపూర్వకంగా మ్యాచ్ ఆడినట్లు ఆయన పేర్కొన్నారు. వికాస్ మిశ్రాకు గాయాలైన వెంటనే ఆటను నిలిపివేసి, అతడ్ని సంజయ్ గాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. జ్యోతిరాదిత్య సింధియా, మాజీ మంత్రి రాజేంద్ర శుక్లా, రేవా ఎంపీ జనార్దన్ మిశ్రాతో కలిసి ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.