కరోనా బారిన పడ్డ బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ చిత్ర పరిశ్రమను కరోనా మహమ్మారి వదలడం లేదు. వరుసగా బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే సింగర్ కనికా కపూర్, నిర్మాత కరీం మోరాని, ఆయన కూతుళ్లు, నిర్మాత బోని కపూర్ ఇంట్లో సహాయకులు కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే.
తాజాగా నటుడు కిరణ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. దీంతో మే 14 నుంచి ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారు. కాగా, 74 ఏళ్ల కిరణ్ పలు బాలీవుడ్ చిత్రాలతో పాటు.. సీరియల్స్లో కూడా నటించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ..'వైరస్ లక్షణాలు లేకపోయినా నాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. జ్వరం, దగ్గు కూడా లేవు. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. అందుకే హోం క్వారంటైన్ అయ్యాను. కరోనా నిర్ధారణ అయి 10 రోజులు అయినప్పటికీ నాలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. మే 26న నాకు రెండో సారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతానికి నేను క్షేమంగానే ఉన్నాను.' అని కిరణ్ తెలిపారు.