తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఫిన్కేర్ బ్యాంకు చోరీ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. దొంగతనం కేసును చేధించిన పోలీసులు.. బ్యాంకు మేనేజర్ స్రవంతినే దొంగగా నిర్ధారించారు. బ్యాంకులో గిల్టు నగలు తాకట్టు పెట్టి మేనేజర్ స్రవంతి చోరీకి పాల్పడినట్లు తేలింది. ఇందుకోసం చెన్నైకి చెందిన ముగ్గురు యువకులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు దొంగతనం చేసినట్లు తేల్చారు.
గురువారం ప ఫిన్కేర్ బ్యాంకులో 85 లక్షల విలువైన బంగారం, నగదు దోచుకెళ్లారు దొంగలు. దొంగతనం గురించి మేనేజర్ స్రవంతిని ప్రశ్నించగా.. ముగ్గురు దుండగులు బ్యాంకులోకి వచ్చి తనను బెదిరించారని చెప్పారు. నోట్లో గుడ్డలు కుక్కి.. కాళ్లు చేతులు కట్టేసి.. 80 లక్షల విలువైన బంగారు అభరణాలు..5 లక్షల నగదు తీసుకుని పరారయ్యారని చెప్పారు. తర్వాత దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు స్రవంతి. ఐతే సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు.. స్రవంతి వ్యవహారశైలిపై అనుమానం వ్యక్తం చేశారు. మరింత లోతుగా దర్యాప్తు జరిపి.. దొంగతనం వెనుక స్రవంతి హస్తం ఉందని నిర్ధారించి ప్రశ్నించగా.. ఆ ప్లాన్ మొత్తం పోలీసుల ముందు బయటపెట్టింది..