తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి తెలంగాణలోని అన్నీ జిల్లాల ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, మాస్క్ ధరించని వారిపై రూ.1000 ఫైన్ వేస్తామని గురువారం తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ ప్రకటించారు. గతకొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఏమాత్రం పెరుగుదల లేకపోయిన ముందు జాగ్రత్తల్లో భాగంగా మాస్క్ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ..”తెలంగాణలో కరోనా ఫోర్త్ వేవ్కు అవకాశం లేదు. రాష్ట్రంలో రోజుకు 20 నుంచి 25 కేసులు నమోదవుతున్నాయి. ప్రజల్లో 93 శాతం యాంటీబాడీస్ను గుర్తించాం. థర్డ్ వేవ్ను సమర్థంగా ఎదుర్కొన్నాం. అయినా కూడా ఫంక్షన్లు, ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సిందే. మాస్క్ తప్పనిసరిగా వినియోగించాల్సిందే. మాస్క్ లేకుంటే రూ.1,000 జరిమానా విధిస్తాం” అని ఆయన ప్రకటించారు.