చినజీయర్ స్వామి దిష్టి బొమ్మలను వెంటనే దగ్ధం చేయాలని భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ఆదివాసీలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం ఆయన సోషల్ మీడియా వేదికగా.. చినజీయర్ స్వామిపై మండిపడ్డారు. ‘ఆదివాసీల ఆరాధ్య దైవాలు సమ్మక్క-సారమ్మలను కించపరుస్తూ మాట్లాడిన చినజీయర్ వెంటనే క్షమాపణలు చెప్పాలి’ అని రేగా కాంతారావు డిమాండ్ చేశారు.
అంతేకాకుండా ”ఆదివాసీ వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలను కోట్లాది మంది ప్రజలు కొలుస్తున్నారు. చినజీయర్ స్వామిలా మోసాలకు పాల్పడడం తమ జాతికి తెలియదు. ఆదివాసీల ఇండ్లలో ఉన్న చినజీయర్ ఫోటోలను దిష్టి బొమ్మలుగా చేసి వెంటనే తగులబెట్టాలి” ఆయన పిలుపు ఇచ్చారు. కాగా, బుధవారం కూడా పలు ప్రాంతాల్లో చినజీయర్ దిష్టిబొమ్మలను తగులబెట్టి, హుందాగా మెలగాలని ఆయనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోపక్క వన దేవతలు సమ్మక్క-సారలమ్మలపై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా ఎంతంటి వివాదాన్ని రేపుతున్నాయో అందరికీ తెలిసిందే. ఈ విషయంపై టీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా స్పందనలు వస్తున్నాయి.