ప్రజలు ఆధార్కార్డు, వాటి జిరాక్స్లను ఎక్కడపడితే అక్కడ వదిలేయొద్దని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధార్ నెంబర్ను సోషల్ మీడియాలోనూ, ఇతర పబ్లిక్ ప్లేస్ల వద్ద షేర్ చేయొద్దని తెలిపింది. ఆధార్ను ధైర్యంగా ఉపయోగించుకోచ్చని, అయితే దాని వినియోగాన్ని గమనిస్తూ ఉండటం మంచిదని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అప్రమత్తం చేసింది. ఆధార్ నెంబర్ను ఇతరులతో షేర్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. ఓటీపీని ఎవ్వరితోనూ చెప్పొద్దని తెలిపింది. ఎం-ఆధార్ పిన్ నెంబర్నూ ఎవ్వరికీ చెప్పొద్దని హెచ్చరించింది. గత 6 నెలల ఆధార్ వినియోగాన్ని యూఐడీఏఐ వెబ్సైట్లో, ఎం-ఆధార్ యాప్లోనూ చెక్ చేసుకోవచ్చని సూచించింది. ఆధార్ ధృవీకరణ జరిపిన ప్రతిసారీ ఆ విషయాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇస్తుందని, అందువల్ల ప్రతి ఆధార్కార్డుదారు తన ఈమెయిల్ను ఆధార్కు అనుసంధానం చేసుకోవాలని తెలిపింది.
ఓటీపీ ఆధారిత ధృవీకరణ ద్వారా పలు సేవలు అందుకోవడానికి వీలున్నందున మొబైల్ నెంబర్ను ఆధార్ నెంబర్తో జతచేసుకోవాలని సూచించింది. ఆధార్ నెంబర్ కావాలని అడిగే సంస్థలు.. దాన్ని ఎందుకోసం అడుగుతున్నదీ స్పష్టంగా తెలుసుకోవాలని చెప్పింది. ఎవరికైనా తమ ఆధార్ నెంబర్ పంచుకోవడానికి ఇష్టం లేకపోతే వర్చువల్ ఐడీని జనరేట్ చేసుకొని వాడుకోవచ్చని పేర్కొంది. దీన్ని యూఐడీఏఐ వెబ్సైట్, మై ఆధార్ పోర్టల్ ద్వారా జనరేట్ చేసుకొని ఆధార్ ధృవీకరణ కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ వర్చువల్ ఐడీని మరుసటిరోజు మార్చుకోవచ్చని పేర్కొంది. ఆధార్కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే 1947 టోల్ఫ్రీ నెంబర్ను 24 గంటల్లో ఎప్పుడైనా సంప్రదించవచ్చని సూచించింది.