చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ గతేడాది డిసెంబరు 8న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం తెలిసిందే. అప్పటినుంచి కొత్త సీడీఎస్ గా ఇంకా ఎవరినీ నియమించలేదు. అయితే, సీడీఎస్ నియామకం చేపట్టే ముందు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. సీడీఎస్ నియామకానికి అర్హత పరిధిని మరింత పెంచుతూ సర్వీసు నిబంధనల్లో సవరణలు చేసింది. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా సవరణలతో త్రీ స్టార్ అధికారులు, రిటైర్డ్ అధికారులు సీడీఎస్ పదవికి అర్హులు కానున్నారు.
ఈ మేరకు జూన్ 6న మూడు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇకపై ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు చెందిన రిటైర్డ్ చీఫ్ లు కూడా సీడీఎస్ అయ్యే వెసులుబాటు కలిగింది. ప్రస్తుతం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ దళాలకు అధిపతులుగా వ్యవహరిస్తున్న వారు, సర్వీసులో ఉన్న త్రీస్టార్ ఆఫీసర్లు, చీఫ్ గా వ్యవహరించి పదవీ విరమణ చేసిన 62 ఏళ్ల లోపు వయసున్న వారు, 62 ఏళ్ల లోపు వయసున్న రిటైర్డ్ త్రీస్టార్ ఆఫీసర్లు… సీడీఎస్ పదవి కోసం అర్హులవుతారని కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో… రిటైర్డ్ అయిన అధికారులను కూడా పరిశీలనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.