తెలంగాణ రాష్ట్రానికి మరో జాతీయ రహదారి రానుంది. కల్వకుర్తి నుంచి ఏపీలోని కరివేన వరకు 122 కిలోమీటర్ల మేర ఈ జాతీయ రహదారి నిర్మాణం జరగనుంది. ఈ మేరకు కేంద్ర జాతీయ రహదారుల శాఖ అనుమతి ఇచ్చింది. ఈ నూతన జాతీయ రహదారితో హైదరాబాద్ నుంచి తిరుపతి మద్య 80 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. 86 కిలోమీటర్లు తెలంగాణలో, 26 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం జరుగుతుంది. కల్వకుర్తి, నాగర్ కర్నూల్ , కొల్లాపూర్, ఆత్మకూరు, నంద్యాల నియోజకవర్గాలను కలుపుతూ ఈ జాతీయ రహదారి నిర్మాణం జరగనుంది. భారతమాల పథకం కింద ఈ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర రవాణా శాఖ ఆమోదం తెలిపింది.
మరోపక్క ప్రాజెక్ట్లో భాగంగా సోమశిల సిద్దేశ్వరం వంతెన నిర్మాణం కూడా చేపట్టనుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.800 కోట్లు ఖర్చు చేయనుంది. కాగా, సోమవారం జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు, నాగర్ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ నెడునూరి దిలీపాచారి కలిసి కేంద్ర రవాణాశాఖ మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని గడ్కరీ వారికి హామీ ఇచ్చారు.